హైదరాబాద్ : దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. పెరుగుతున్న కేసుల మధ్య తప్పనిసరిగా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన మాస్క్ అడెరెన్స్ అధ్యయనంలో హైదరాబాద్లో దాదాపు 37 శాతం మంది మాస్క్లు ధరించడం లేదని తేలింది.
ఫౌండేషన్ హైదరాబాద్, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, సిమ్లా, పుణే, జమ్మూతో పాటు పలు నగరాల్లో సర్వే నిర్వహించింది. సర్వే చేసిన జనాభాలో 37.13 శాతం మంది మాస్క్లు ధరించడం లేదని, 17.10 శాతం మంది పాక్షికంగా, 45.76 శాతం మంది మాత్రమే మాస్క్లు పెట్టుకున్నట్లు గుర్తించారు. ముక్కు, నోరు రెండింటినీ కప్పి ఉంచేలా మాస్క్ ధరించిన వారినే సరిగ్గా మాస్క్లు పెట్టుకున్నట్లు లెక్క.
సర్వే ప్రకారం, కేవలం 28.45 శాతం మంది మాల్స్లో పూర్తిగా మాస్క్లు ధరించారు. 66.67 శాతం మంది పార్కులు, 70.83 శాతం మంది మెట్రో, లోకల్ రైళ్లలో ప్రయాణ సమయంలో పెట్టుకున్నట్లు గుర్తించారు. అయితే, మాస్క్లు పెట్టుకోకపోవడానికి కారణాలు అడిగితే 30శాతం మంది వివిధ కారణాలను చెప్పారని, మరో 30శాతం మంది తమకు సరిగా ఊపిరాడడం లేదని, చిరాకుగా ఉందని చెప్పినట్లు అధ్యయనం పేర్కొంది.
మిగతా 40శాతం మంది ఇంకా టీకా తీసుకున్నందున కొవిడ్ ముప్పు ఉందని భావించడం లేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మాస్క్లు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తూ.. నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. నగరంలోని కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పర్యటించి మరింత అవగాహన కల్పించి, ఫేస్మాస్క్ నిబంధన అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటుండగా.. నిబంధనలు ఉల్లంఘించిన పలు చోట్ల పోలీసులు కేసులు సైతం నమోదు చేస్తున్నారు.