హైదరాబాద్ : నిషేధ చైనా మాంజా అమ్మకాలు జరుగకుండా రాష్ట్రంలో ఐదు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటుచేసినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ తెలిపారు . చైనా మాంజాను రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. చైనా దారం అమ్మకం గురించి వివరాలు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 సమాచారం అందజేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా ఉందని తెలిపారు.
మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా ఉంటుందన్నారు. గత కొన్నేళ్లుగా రూ. 28 లక్షల విలువైన 1391 కిలోల చైనీస్ మాంజా సీజ్ చేశామని అధికారులు తెలిపారు. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు. నైలాన్, సింథటిక్ మాంజా (చైనీస్ మాంజా) వాడకం వల్ల అనర్థాలపై అందరూ అవగాహన కలిగిఉండాలని అన్నారు. కేంద్ర పర్యావరణ చట్ట ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని తెలంగాణలోనూ నిషేధించినట్లు ఆయన వివరించారు.
పతంగులు ఎగరవేసేందుకు గ్లాస్ కోటింగ్ తో ఉన్న నైలాన్ , సింథటిక్ తాడును కొందరు వాడుతున్నారని, దీని వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరుగుతోందన్నారు. ‘ దారంలో చిక్కుకున్న పక్షులు విలవిల్లాడి, చనిపోతున్నాయి. మనుషులు కూడా గాయపడుతున్నార’ ని తెలిపారు. చైనీస్ మాంజా బదులు సంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని కోరారు.