సిద్దిపేట, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పరులకు సాయం చేయాలంటే కోట్లకొద్ది డబ్బున్న శ్రీమంతులే కానక్కర్లేదు. సాటి మనిషిని ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే చాలని నిరూపిస్తున్నారు డాక్టర్ పీ రఘురాం. కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రఘురాం సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 37 మంది పదేండ్లలోపు ఆడిపిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని ఎనిమిదేండ్ల క్రితం డాక్టర్ రఘురాం దత్తత తీసుకున్నారు. గ్రామంలోని ఆడపిల్లలకు భద్రత ఇవ్వాలన్న తలంపుతో ఒక్కో అమ్మాయికి రూ.27 వేల చొప్పున మొత్తం 37 మందిపై ఫిక్స్డ్ డిపాజిట్లు చేశా రు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఆదివారం ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ డాక్టర్ రఘురాం పేదలకు సాయం చేయాలని క్షణం తీరిక లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారని, తాను సంపాదించిన దాంట్లో తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని కొనియాడారు.
ఈ గ్రామాభివృద్ధికి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారని, ఈయన చేయూతతో ఇప్పటికే ఈ గ్రామం 5 జాతీయ, 5 రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకున్నదని తెలిపారు. గ్రామాభివృద్ధికి నిస్వార్థంగా సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రజల్లో చైతన్యం తెస్తూ సంఘసేవకునిగా పనిచేస్తున్నారని అభినందించారు. అంతకుముందు డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఇతరులకు సాయం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మంత్రి హరీశ్రావు ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. ఆడపిల్లల కష్టాలు తనకు తెలుసునని, వారి భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశానని చెప్పారు. ఇదంతా మంత్రి హరీశ్రావు చొరవతోనే సాధ్యమైందని చెప్పారు. ఆ పిల్లలకు 21 సంవత్సరాలు వచ్చేసరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందుతాయని వెల్లడించారు. పై చదువులకు, లేదా పెండ్లిళ్లకు ఈ మొత్తం అక్కరకొస్తుందని చెప్పారు.
ఇబ్రహీంపూర్లో అభివృద్ధి పనులు
దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్లో డాక్టర్ రఘురామ్ ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వైకుంఠధామం, గొర్రెల షెడ్లు, హోమ్ సోలార్ సిస్టమ్తో పాటు విద్యాలయానికి డైనింగ్రూమ్, డిజిటల్ స్టడీ రూమ్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. అంతేగాక గ్రామీణ యువత కోసం జిమ్, యోగా తరగతులను ఏర్పాటు చేశారు.
ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదివేల గ్రామాలున్నాయని చెప్తూ ఔత్సాహికులైన పదివేల మంది పౌరులు ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నది తన కోరికని డాక్టర్ రఘురామ్ వెల్లడించారు. ఇబ్రహీంపూర్ మాడల్గా ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల గ్రామాలున్నాయని, 70 శాతం మంది గ్రామాల్లోనే జీవిస్తున్నారని వివరించారు. 6 లక్షల గ్రామాలను కూడా ఇలాగే దత్తత తీసుకుని బాగు చేయాలని, అలా చేస్తే రాబోయే 25 ఏండ్లలో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.