Social Media | న్యూఢిల్లీ, ఆగస్టు 19: సోషల్ మీడియా యూజర్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పోస్ట్లు చేసేటప్పుడు జాగరూకత, అప్రమత్తతతో వ్యవహరించాలని, లేదంటే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నటుడు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్ దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం తోసిపుచ్చింది.
మహిళలకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్న ఓ పోస్ట్ను ఫేస్బుక్లో ఫార్వార్డ్ చేశాడన్న ఆరోపణలపై 2018లో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీచేయాలని మద్రాస్ హైకోర్టులో శేఖర్ ఇటీవల పిటిషన్ వేశారు. ఆయన విన్నపాన్ని హైకోర్టు జూలై 14న తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘సోషల్మీడియాలో పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అది ఏమేరకు ప్రభావం చూపుతుందన్నది తెలిసి వుండాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది.