హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది.
తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు లోబడి ఉంటాయని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుకు భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మూడో టీఎంసీని వ్యతిరేకిస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చెరువకు శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తితో పాటు పలువురు రైతులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, రాజకీయ కారణాలతో కాళేశ్వరానికి అడ్డుపడుతున్నారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.