హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన చరాస్తులు, బ్యాంకుల్లో ఉన్న నగదు పం పిణీ అంశాలను పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. చరాస్తులతో పాటు, స్థిరాస్తులను సైతం పంచాలని ఏపీ సర్కారు డిమాండ్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ముందుగా అకాడమీకి సంబంధించిన చరాస్తుల పంపకాలు, బ్యాంకుల్లో ఉన్న నిధుల బదిలీ అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. స్థిర, చరాస్తుల పంపకాలపై ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని తెలంగాణ సర్కారు ధర్మాసనానికి నివేదించింది. బ్యాంకుల్లో ఉన్న నిధులను ఏపీకి బదిలీచేస్తామని వెల్లడించింది. మిగిలిన విషయాలు తదుపరి విచారణలో పరిశీలించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.