Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ మూడు వారాల గడువునిచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ దాఖలుచేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత విచారణ తర్వాత జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. మూడు వారాల సమయాన్ని ఇచ్చింది. నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే, కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.