హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం కానున్నది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రారంభంకాగానే మరోసారి ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముం దుంచారు. దీనిని పరిశీలించి ఈనెల 23న విచారిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఇదిలా వుండగా సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తుండగా, హైకోర్టులో వచ్చిన తీర్పు మరోసారి సుప్రీంకోర్టులోనూ వస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్కు మాత్రమే రాజధాని మార్పు అధికారం ఉన్నదని వాదిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నది. ఈ నెల 23న విచారణ తరువాత సుప్రీంకోర్టు ఏం చెప్పబోతున్నదని, ఈ వివాదంపై తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.