యాదగిరిగుట్ట, జనవరి30: యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వయంభునారసింహుడిని మేల్కొలిపి భక్తిశ్రద్ధలతో సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు.. తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధి సేవ, దర్బార్ సేవ, రాత్రి నివేదన శయనోత్సవ కార్యక్రమాలను చేపట్టి ఆలయాన్ని మూసివేశారు. కాగా.. హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, డాక్టర్ హర్షిణీతో కలిసి ఇటలీ దేశానికి చెందిన శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ లారెంజో, డాక్టర్ పియరో కాండోలి, డాక్టర్ వాలెంటినా స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వైద్యబృందం సభ్యులు ఆలయ పునర్నిర్మాణ పనులను ఆసక్తిగా తిలకరించారు. ఆలయ నిర్మాణ తీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన రాష్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు కితాబిచ్చారు. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకొన్నారని, ఖజానాకు రూ.23,04,311 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.