మహబూబ్నగర్ అర్బన్/పాలమూరు/గొల్లపల్లి, సెప్టెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ నిరుపేదలకు ఎంతో ఆసరా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట 61 మంది లబ్ధిదారులకు, జమిస్తాపూర్లో 65 మందికి, తెలుగుగూడెంలో 25 మందికి ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే అర్ధరాత్రి అయినా సరే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరివెన రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఇంత మంచి పాలన ఎక్కడా లేదు: కొప్పుల
ఎక్కడ వెతికినా ఇంత మంచి పాలన దొరకదని, ఇలాంటి పాలన దేశానికే ఆదర్శమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 1,631 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలున్నాయని, అందులో 46 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు మాత్రమే ఇస్తున్నారన్నారు.
తెలంగాణలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, గీత కార్మికులు, బోదకాల బాధితులతోపాటు కొత్తగా కిడ్నీ డయాలసిస్ బాధితులకు పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాజస్థాన్లో వృద్ధాప్య పింఛన్ రూ.వెయ్యి, దివ్యాంగులకు రూ.1,500, మహారాష్ట్రలో వృద్ధాప్య, దివ్యాంగులకు రూ.600, గుజరాత్లో వృద్ధులకు రూ.750, వికలాంగులకు రూ.600, యూపీ, కర్ణాటకల్లో రూ.600 చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు.