హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధిస్తున్న జీఎస్టీపై బీజేపీ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారని, పదే పదే అసత్య ప్రచారాలు చేస్తున్నారని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన పెహచాన్ కార్డున్న చేనేత కార్మికులు జీఎస్టీ లేకుండా నూలు కొనుగోలు చేయొచ్చని, చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని బీజేపీ నేతలు ప్రచారం చేయడంపై చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెహచాన్ కార్డు పట్టుకొని వస్తారు.. జీఎస్టీ లేకుండా నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెచ్డీసీ) ద్వారానైనా, మరే ఇతర ఏజెన్సీల నుంచైనా పట్టు, కాటన్, నూలు ఇప్పించాలని సవాల్ విసిరారు. దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో పెహచాన్ కార్డులు పట్టుకొని బీజేపీ ఆఫీసుల ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పెహచాన్ కార్డు ద్వారా జీఎస్టీ లేకుండా క్రయవిక్రయాలను అధికారికంగా చేస్తే తమకు ఉద్యమాలు చేసే అవసరమే లేదని వెంకన్న స్పష్టం చేశారు.