హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కార్మిక శాఖలో సంచలనం సృష్టించిన బీమా క్లెయిమ్ల కుంభకోణంపై ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ జరిపిస్తున్నది. భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.150 కోట్లకుపైగా బీమా సొమ్మును కొందరు దళారులు దిగమింగడంపై ‘నమస్తే తెలంగాణ’లో వరుసగా కథనాలు రావడంతో నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సీఈవో ఎట్టకేలకు స్పందించడం, కార్మిక శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ కమిషనర్ను విచారణాధికారిగా నియమించడం తెలిసిందే.
ఆయన సంబంధిత రికార్డులను పరిశీలించి, బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విచారణను కేవలం ఇద్దరు అధికారులకే పరిమితం చేసిన ఆయన.. తదుపరి విచారణను కార్మిక శాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేసే జాయింట్ కమిషనర్ (అడ్మిన్) చంద్రశేఖరానికి అప్పగించారు. విచారణ అంతా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కేంద్రాలకే పరిమితమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో బీమా క్లెయిమ్ల కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ అటువైపు దృష్టిసారించడంలేదు.
వాస్తవానికి కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచే అవినీతి పెరిగిందని, ఆ కంపెనీకి చెందిన బ్రోకర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై రూ.150 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వరంగల్ జాయింట్ కమిషనర్ జరిపిన విచారణలోనే రూ.10 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తేలింది. కానీ, ఆ అక్రమాలకు పాల్పడినవారిపై కార్మిక శాఖ అధికారులు ఇప్పటికీ కేసులు పెట్టలేదు. కనీసం ఆ అక్రమార్కులు స్వాహా చేసిన బీమా క్లెయిమ్ల సొమ్మును కూడా రికవరీ చేయలేదు. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తున్నది.