Minister Harish rao | వరంగల్, మే 31 (నమస్తేతెలంగాణ): వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయినట్టు వెల్లడించారు. రెండేండ్లలో దవాఖాన నిర్మాణం పూర్తిచేయాలని మొదట నిర్ణయించినా, ఏడాదిన్నరలోపే పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దవాఖాన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116 కోట్లతో నిర్మిస్తున్న 24 అంతస్థుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు.
దవాఖాన నిర్మాణ పనుల పురోగతిపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్రాలను తిలకించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియదిరిగి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ ఇంజినీర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. వరంగల్ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖానను రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్నట్టు చెప్పారు. పది అంతస్తుల వరకు నిర్మాణం పూర్తయిందని, ఈ పది అంతస్తుల్లో వైద్య సేవలను ముందుగా అందించడానికి హెల్త్, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని ఆదేశించారు. దసరా పండుగలోగా పది అంతస్థులను పూర్తిస్థాయిలో అందిస్తామని ఏజెన్సీ, ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. 24 అంతస్తుల స్లాబ్ పనులను నవంబర్ నాటికి పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో దవాఖానను పూర్తిగా అందుబాటులోకి తెస్తామని ఇంజినీర్లు చెప్పినట్టు తెలిపారు.
దవాఖాన నిర్మాణంలో దాదాపు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాజాగా దవాఖాన ప్లింత్ ఏరియా 16.50 లక్షల చదరపు అడుగుల నుంచి 20.76 లక్షల చదరపు అడుగులకు పెంచామని, ఇందులో 14 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. పడకల స్థాయి కూడా 2,100కు పెరిగిందని వెల్లడించారు. ఈ దవాఖానలో 36 రకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.
ఈ దవాఖాన ప్రారంభమైతే ఆధునిక వైద్యం కోసం వరంగల్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. నిమ్స్, ఇతర కార్పొరేటల్ దవాఖానల్లో లభించే అత్యాధునిక వైద్య సేవలన్నీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దవాఖానలో ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడుతూనే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అంబులెన్సులు ట్రామా కేర్లోకి సులువుగా వెళ్లేలా ప్రత్యేక డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్లు ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు.
కిడ్నీ, లివర్ తదితర మార్పిడి చికిత్సల సమయంలో రోగుల బంధువులు దవాఖానలో అందుబాటులో ఉండేలా హాస్పిటల్ ఆవరణలోనే 250 మందికి సరిపడా అన్ని సౌకర్యాలతో ధర్మశాలను నిర్మిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. 4,800 కిలోవాట్స్ విద్యుత్తు సరఫరాకు అనుగుణంగా 6 వేల కిలోవాట్స్ సామర్థ్యం గల జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 1,200 కిలోలీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీ ప్లాంట్, 800 కిలో లీటర్ల వాటర్ ట్రీట్మెంటు ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 400 మంది రెసిడెంట్ డాక్టర్లకు అన్ని వసతులతో దవాఖానపైన ప్రత్యేక గదులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 450 మందితో సమావేశం నిర్వహించేలా కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. వరంగల్లో హెల్త్ యూనివర్సిటీతో పాటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన కూడా ఉండటం గర్వకారణమని అన్నారు.
వరంగల్పై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేఎంసీ ఒక్కటే ఉండేదని, నేడు దానికి అదనంగా ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఒకే నియోజకవర్గం ఉన్న భూపాలపల్లి, ములుగు వంటి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయడం దేశంలోనే రికార్డు అని అన్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాలు కావటం వల్ల ఒకే నియోజకవర్గం ఉన్నా ఈ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ ఏడాది జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో కాలేజీలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ములుగులో కూడా మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తేవాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. జనగామ మెడికల్ కాలేజీకి 51, భూపాలపల్లి మెడికల్ కాలేజీకి 54 మంది ప్రొఫెసర్లను నియమించామని చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి, నీట్ ఫలితాలు కూడా వచ్చినందున ఇక కౌన్సెలింగ్ ప్రారంభించి కేఎంసీ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తామని వివరించారు.
ఏ ప్రాంతం విద్యార్థులు అక్కడి కాలేజీల్లో చదవటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి రావటంతోపాటు ఒక్కో కాలేజీలో రెండు వేలమందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 2,958 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, నేడు 8,340 సీట్లకు పెంచామని తెలిపారు. వైద్యవిద్య కోసం తెలంగాణ విద్యార్థులు రష్యా, చైనాకు పోవాల్సిన అవసరం లేదని అన్నారు. వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు కేటాయించడం వల్ల రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని తెలిపారు. కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్ కిట్స్, డాక్టర్లు, సిబ్బంది నియామకం వంటి సౌకర్యాలను కల్పించడం వల్ల ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగిందని అన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 70 శాతం నమోదవుతున్నట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 30 శాతం, ప్రైవేటు దవాఖానల్లో 70 శాతం ఉండేవని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. చాలా రాష్ర్టాల్లో ఇంకా ఇండ్ల వద్దే ప్రసవాలు జరుగుతున్నాయని, మన రాష్ట్రంలోనే వందకు వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అన్నారు.
దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు, 157 నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో ఇప్పటికే 12 మెడికల్ కాలేజీలను నిర్మించిందని, ఈ ఏడాది మరో 9 కాలేజీలు పూర్తవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పట్టుదల, విజన్తో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అత్యద్భుత సచివాలయం, అమరుల స్మారకం, మెడికల్ కాలేజీలు నిర్మించారని అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం కుదువపెట్టిందని కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ ఎంపీ పీ దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, ఆర్ అండ్ బీ వరంగల్ ఎస్ఈ నాగేందర్రావు, ఈఈ జితేందర్రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎస్ సమ్మారావు, పుల్లా పద్మావతి, జీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.