Summer | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన వేసవిని చూడక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో తీవ్రంగా ఉన్నందున దాని ప్రభావంతో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ఏప్రిల్ తర్వాత ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, ఆ క్రమంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారి సెప్టెంబర్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల నైరుతి రుతుపవన వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్తున్నది. అక్టోబర్ చివరినాటికి 60% శాతం లానినా పరిస్థితులు ఏర్పడతాయని, శీతాకాలంలో తీవ్రమైన చలి ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) అంచనా వేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగవచ్చని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి తెలిపారు.