హైదరాబాద్, మార్చి 17 : మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాలో వరుసగా రెండురోజుల నుంచి వడగాడ్పులు వీస్తున్నాయి. గడిచిన పదేండ్లలో మార్చిలో వడగాడ్పులు వీచిన దాఖలాలు లేవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఇది సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అధికమని పేర్కొన్నది. మూడురోజులుగా నల్లగొండ జిల్లాలో సాధారణం కన్నా 5 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే 5 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్డీపీఎస్ రికార్డులు తెలిపాయి. నల్లగొండ జిల్లాలో గత మార్చి 17న 37.4 డిగ్రీలు ఉండే, ఈ ఏడాది ఇదే రోజున 43.5 డిగ్రీలు నమోదైంది. పెద్దపల్లిలో గతేడాది 37.1 డిగ్రీలు నమోదుకాగా.. ఇప్పుడు 43 డిగ్రీలు రికార్డయింది.
ఉత్తరాది నుంచి పొడిగాలులతో..
ఉత్తరాది నుంచి పొడిగాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే పొడిగాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులు వీస్తున్నాయని పేర్కొన్నది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నది. గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. ఈ వేసవిలో ఎక్కువరోజులు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం కూడా తగ్గుతుందని అంచనా వేశారు.