భైంసా టౌన్ : ఓవైపు భానుడు సెగలు కక్కుతుంటే.. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు కరెంటు కోతల కారణంగా చీకట్లలోనే కాలం గడుపుతున్నారు. భైంసా పట్టణంతోపాటు గ్రామాల్లో గాలిదుమారానికి చెట్టు ఊగినా.. చిన్నపాటి చినుకు పడినా గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నది.
శనివారం సాయంత్రం కురిసిన చిన్నపాటి గాలివానకు మండల వ్యాప్తంగా రాత్రంతా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. సోమవారం నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా మంగళవారం సాయంత్రం వరకూ పత్తాలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో పునరుద్ధరణ పనులు బుధవారం కూడా కొనసాగేలా ఉన్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.