న్యూఢిల్లీ: పెద్దపల్లి జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ అవార్డు వచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి అవార్డు సాధించింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా సుల్తాన్పూర్ గ్రామానికి దక్కిన అవార్డును ఆ గ్రామ సర్పంచ్ అర్షనపల్లి అర్షనపల్లి వేంకటేశ్వర్ రావు.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పంచాయతీ కార్యదర్శి వినోద్ కృష్ణలతో కలిసి అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు.
అవార్డు కింద ఒక షీల్డ్, ప్రశంసా పత్రం, రూ. 50 లక్షల నగదును అందజేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి వీ చంద్రమౌళి, మండల పంచాయతీ అధికారి వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, ఈ-పంచాయతీ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ (SPM) రాజయ్య, ఈ-పంచాయతీ ఆపరేటర్ సుంక శ్రీకాంత్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.