మియాపూర్, ఫిబ్రవరి 3: మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో కార్మికుల జీవనోపాధికి గండి కొట్టడం ఏమాత్రం సరికాదని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకంతో ఆటోలు నడవక, సరైన జీవనోపాధి లభించక రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆటో సరిగా నడవక, కుటుంబ పోషణ భారంగా మారి రెండు రోజుల క్రితం ప్రజా భవన్ ఎదుట ఆటోను తగులబెట్టుకున్న మియాపూర్ నడిగడ్డతండాకు చెందిన దేవ్లానాయక్ను ఎమ్మెల్యే గాంధీ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా దేవ్లా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో వందల మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆగ్రహించారు. కేవలం ప్రజా భవన్గా పేరు మారిస్తే సరిపోదని, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండాలని హితవుపలికారు. తొలి సీఎం కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు సబ్బండ వర్ణాలు సంతోషంగా జీవించారని, కాంగ్రెస్ 55 రోజుల పాలనలోనే నానా యాతన పడుతున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేలు వేతనంగా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పార్టీ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్, స్వామి, హన్మంత్, తిరుపతి, గోపి, సుధాకర్, కమలాకర్, మోహన్, జితేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆటో యజమానులు నిరసన తెలిపారు. స్థానిక తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 50 రోజుల క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోయామని, కనీసం కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దివాలా తీస్తున్న ఆటోవాలాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు ఇబాదుల్లాఖాన్, సభ్యులు రాజు, భాను, చందర్, శంకర్, మహేశ్, రమేశ్ పాల్గొన్నారు.