శాలిగౌరారం, మే 7: ఓ వైపు కొడుకుకు తమ వృద్ధాప్య జీవితం భారం కావొద్దనే ఆలోచన.. మరో వైపు తీవ్రంగా వేధిస్తున్న అనారోగ్యాన్ని తట్టుకోలేక వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం రాత్రి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండంలోని అడ్లూర్ గ్రా మంలో చోటుచేసుకున్నది. అడ్లూర్కు చెం దిన చిలుకూరి నర్సయ్య(75) పక్షవాతంతో, అతని భార్య లక్ష్మమ్మ (65) అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురికి పెండ్లి చేశారు.
కుమారుడు చిలుకూరి యాదయ్య భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పటికే తల్లిదండ్రులకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించాడు. అయినా.. నయం కాలేదు. వారిని ఇంటి వద్దే ఉంచి హైదరాబాద్ నుంచి తరచూ వచ్చి తల్లిదండ్రుల బాగోగులను చూసుకొని వెళ్తున్నాడు. తమ వల్ల కొడుకు ఇబ్బంది పడుతున్నాడని మనోవేదనకు గురైన ఆ వృద్ధ దంపతులు.. శనివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి తలుపు తీసి చూడగా అప్పటికే మృతిచెందారు. ఈ సమాచారాన్ని స్థానికులు కుమారుడికి తెలియజేశారు.