భూపాలపల్లి రూరల్/బంజారాహిల్స్, మార్చి 30: కాంగ్రెస్ పార్టీలో పారాచ్యూట్ నేతలకే ప్రాధాన్యం దక్కుతున్నదని, పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని భూపాలపల్లి పట్టణంలోని ఫకీరుగడ్డకు చెందిన కృష్ణసాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం ఎదుట శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణసాగర్ తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోగా మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య చేరదీసి పెంచి పెద్ద చేశారు. భూపాలపల్లి పట్టణంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పటి నుంచి పార్టీ ముఖ్యకార్యకర్తగా పనిచేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు భూపాలపల్లిలోని సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి చేపట్టిన పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నాడు. మూడునెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనలాంటి కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పట్టించుకోవడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం నగరానికి వచ్చిన కృష్ణసాగర్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసం వద్దకు చేరుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం రేవంత్రెడ్డికి వివరిస్తానని భద్రతా సిబ్బందిని కోరాడు. అయితే అపాయింట్మెంట్ లేకుండా లోనికి పంపించలేమంటూ పోలీసులు చెప్పారు. దీంతో తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిమీద పోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించారు. కృష్ణసాగర్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు.