హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ స్వతహాగా రైతు.. అంతకు మించి అన్నదాతల కష్టం తెలిసిన రైతుబిడ్డ. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించగానే మొట్ట మొదట వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంపైనే దృష్టిపెట్టారు. దీని ఫలితమే మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా పథకాలు. తెలంగాణ వ్యవసాయ విధానం ఎలా ఉండాలి? ఏ పంటలు వేస్తే బాగుంటుంది? రైతుకు ఏ విధంగా మేలు జరుగుతుంది? అనే అంశాలపై సీఎం కేసీఆర్కు ఉన్న సంపూర్ణ అవగాహనకు ఈ పథకాలు ఉదాహరణలు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ సరళిని పరిశీలించటంతోపాటు ఎప్పుడు ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందన్నదానిపై సీఎం నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆయన రైతులకు పలు పంటలను సాగు చేయాలని, లాభసాటిగా ఉంటుందని సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
సీఎం చెప్పాడంటే ధర పలకాల్సిందే
ఫలానా పంటను సాగు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారంటే అది రైతుల మేలు కోసమే తప్ప, మరో ఆలోచనకు తావుండదు. సీఎం సూచించిన పంటలకు ఆ ఏడాది భారీగా డిమాండ్ ఉండటంతోపాటు మద్దతుకు మించి ధర పలకడం పక్కా. గతంలో సన్నాల సాగైనా, ఇప్పుడు పత్తిసాగైనా ఈ కోవలోకే వస్తాయి. ఈ ఏడాది పత్తికి పలుకుతున్న ధర, డిమాండే ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయ మార్కెట్ను ముందుగానే అంచనా వేసిన సీఎం, సుమారు 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రణాళిక రూపొందించి, రైతులను ప్రోత్సహించారు. కానీ రైతులు పత్తిసాగుకు వెనుకంజ వేసి, కేవలం 46.42 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఇప్పుడు పత్తి రికార్డులు తిరగరాస్తూ క్వింటాల్కు రూ.10 వేలు దాటింది. మద్దతు ధర రూ. 6,025 ఉండగా ఈ సీజన్ ప్రారంభమైన తొలిరోజే రూ.7,610 పలికింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు గత వానకాలంలో పత్తిసాగు చేసిన రైతుల పంట పండింది. కష్టానికి మించి ప్రతిఫలం దక్కుతున్నది. ఈ నేపథ్యంలో వచ్చే వానకాలం సీజన్లోనూ రాష్ట్రంలో భారీ విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని నిర్ణయించారు. కోటి ఎకరాలకుపైగా పత్తి సాగయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు.
సన్నాల సూచనపై రాద్ధాంతం
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, మార్కెట్ డిమాండ్ను ముందే గమనించిన సీఎం కేసీఆర్ గతేడాది వానకాలంలో సన్నరకపు ధాన్యం సాగు చేయాలని రైతులకు సూచించారు. కానీ ఆ ఏడాది అనుకోని విధంగా అకాల వర్షాలు కురవటంతో పంట దెబ్బతిన్నది. సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం మంచి ఆలోచన చేసినప్పటికీ ప్రకృతి సహకరించలేదు. కానీ పనిలేని ప్రతిపక్షాలు ఈ అంశానికి రాజకీయరంగు పులిమి రైతులను పక్కదారి పట్టించాయి. అనవసర రాద్ధాంతం సృష్టించాయి. ఆ ఏడాది బహిరంగ మార్కెట్లో సన్నాలకు భారీ డిమాండ్ పలికింది. క్వింటాల్కు మద్దతు ధర రూ.1,860 ఉండగా వ్యాపారులు రూ.2,500 వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో సన్నరకం ధాన్యం మంచి ధర పలుకుతున్నది. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా విక్రయించుకొనే వెసులుబాటు రైతులకు కలుగుతున్నది. తెలంగాణ నుంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే రైతులకు నష్టం జరుగొద్దనే ఉద్దేశంతో వరి సాగు వద్దని, ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. దీన్ని కూడా ప్రతిపక్షాలు రాద్ధ్దాంతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు వద్దన్నట్టు విషప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం రైతులను బలిపశువును చేస్తున్నాయి.