రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గంతోపాటు ప్రభుత్వ అధికారులతో ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలను ధరింపజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. ఇలాంటి తరుణంలో చేనేత కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారం వేయడం ఏంది? జీఎస్టీ భారం అన్నది పద్మశాలీల ఆత్మహత్యలను పెంచే పరిస్థితి కనిపిస్తున్నది. నేతన్నల జీవితాలు పాతాళానికి కూరుకుపోతాయి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రయోజన పథకాలను తీసుకురావాలి. జీఎస్టీని రద్దు చేసి చేనేతను కాపాడాలి. – సుద్దాల అశోక్ తేజ, పాటల రచయిత
ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వ సహకారం లేకపోతే నడిచే పరిస్థితి లేదు. చేతితో చేసే నేత పనికి ధర అధికంగా ఉంటుంది. మిషన్పై చేసే పనికి ధర తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత వస్ర్తాలపై జీఎస్టీ భారంతో ఉత్పత్తి ధర పెరుగుతుంది. నేత కూళ్లతోపాటు జీఎస్టీ భారంతో చేనేత వస్ర్తాల ధరలు మరింత పెరిగితే మార్కెట్లో వీటిని కొనే వారి సంఖ్య తక్కువ అవుతుంది. చేనేత కార్మికులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్రం స్పందించి చేనేతపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వృత్తిని ముందు తరాలకు అందించాలి. అందుకే ప్రధాని మోదీకి ఉత్తరం రాశాను. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత