కరీంనగర్ : శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( సుడా) నిధులు రూ. 10 కోట్లతో సుడా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు అధ్యక్షతన నిర్వహించిన సుడా సర్వసభ్య సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ లతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సుడా పరిధి లోని కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజక వర్గాలలోని 72 గ్రామాలను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నలువైపుల నుంచి కరీంనగర్కు వచ్చే రహదారుల వద్ద ముఖద్వారాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచేందుకు రోడ్లు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. మానకొండూర్ చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని కోరారు. మానకొండూరు నియోజకవర్గంలోని మైలారం గ్రామంలో ఉన్న గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మానేరు జలాశయం నుంచి బోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులతో సుడా పరిధిలోని గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దాలని కోరారు.
జీవి రామకృష్ణ రావు మాట్లాడుతూ జిల్లా మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ లా సూచన మేరకు సంస్థ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, సుడా డైరెక్టర్లు మంద రమేష్ గౌడ్, కామారం శ్యామ్ శైలేందర్, యాదవ్, ఉదరపు మారుతి , రవీందర్ వర్మ, వంగర రవీందర్, సిహెచ్ శోభ, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.