Singareni | కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా సింగరేణి ఆసుపత్రుల్లోనూ సేవలు అందించాలని యాజమాన్యం భావిస్తున్నది. యాజమాన్యం ఆకాంక్ష మేరకు కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కేవలం హైదరాబాద్ రిఫరల్ ఆసుపత్రులకే పరిమితమైన మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సను కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఈ నెల 25న విజయవంతంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా కాసిపేట గనిలో ఫిట్టర్గా పనిచేస్తున్న కార్మికుడు బ్రహ్మచారి తండ్రి కృష్ణమూర్తికి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
74 సంవత్సరాల కృష్ణమూర్తి మోకాళ్లు పూర్తిగా అరగడంతో నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు మోకాళ్లు అరిగిపోయాయని, మోకాలి చిప్పల మార్పిడి తప్పనిసరి అని నిర్ణయించారు. ఆర్థోసర్జన్లు రేష్మ, సువర్ణ రేఖ, విక్రమ్ బృందం ఈ నెల 25న విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. వీరికి ఎనస్తీషియన్లు నాగరాజు, కృష్ణమూర్తి, సహకారం అందించారు. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే కృష్ణమూర్తి మామూలుగానే నడుస్తున్నారని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఫైనాన్స్ (పా) బలరామ్ ఆదివారం కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిని సందర్శించారు. ఆపరేషన్ చేయించుకున్న కృష్ణమూర్తిను పరామర్శించారు.
కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో తనకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, వైద్యసేవలు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ సింగరేణికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ తరహా ఆపరేషన్లకు హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ.2లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అయితే, కంపెనీ ఆసుపత్రిలో కేవలం ఇంప్లాంటేషన్ వ్యయం రూ.50వేలతోనే పూర్తి చేశామని వివరించారు. డైరెక్టర్ ఫైనాన్స్ (పా) ఎన్ బలరామ్ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఆర్థోసర్జన్లు, సిబ్బందికి అభినందించారు.
ఇలాంటి ఆపరేషన్లు రామగుండం, కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏడాది మోకాలి చిప్ప మార్పిడికి సంబంధించిన కేసులు చాలానే వస్తున్నాయని, హైదరాబాద్ రిఫరల్ ఆస్పత్రుల్లో ఈ తరహా ఆపరేషన్లకు సుమారుగా రూ.2లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య నిపుణులను నియమించడంతో పాటు ఈ తరహా ఆపరేషన్లు కంపెనీ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.