హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు సైతం విడుదల చేసింది. ప్రభు త్వ మార్పు అనంతరం టీఎస్పీఎస్సీ అధికారులు ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడం మరిచారు. దీంతో ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శనివారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కావస్తున్నా పోస్టుల భర్తీ అంశాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏఈఈ రాత పరీక్షల తర్వాత నిర్వహించిన పరీక్షలు ముగించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నా తమ అంశాన్ని పక్కనపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
అన్ని ప్రభుత్వ విభాగాల్లో మహిళా అభ్యర్థులకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల ఏఈఈ నియామక ప్ర క్రియ ఆలస్యమవుతున్నదని టీఎస్పీఎస్సీ చైర్మన్ తమతో అన్నారని ఏఈఈ బాధిత అభ్యర్థి సుశాంత్రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే తమకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.