హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): అమెరికాలో చదువుకోవాలనే కలను నిజం చేసుకోవాలంటే తొమ్మిదోతరగతి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు విద్యావేత్త ప్రొఫెసర్ అలూరు సుభాష్బాబు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సుల్లో చేరాలంటే తొమ్మిదో తరగతి నుంచి, మాస్టర్స్ ప్రోగ్రామ్స్(ఎంఎస్) కోర్సుల్లో చేరాలంటే ఇంజినీరింగ్ ఫస్టియర్ నుంచే ప్రిపరేషన్ను ప్రారంభించాలని సూచించారు. మధ్యవర్తుల (కన్సల్టెన్సీ) ప్రమేయం లేకుండా, డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేకుండానే డాలర్ డ్రీమ్స్ను సాకారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకోవాలనేకొనే వారికి మార్గనిర్దేశంచేస్తూ ఆయన ‘డాలర్ డ్రీమ్జ్’ పుస్తకాన్ని రచించారు. శనివారం సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆ దవాఖాన అధినేత డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత సుభాష్బాబు ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. అమెరికాలో ఐదువేలకు పైగా యూనివర్సిటీలున్నాయని, ప్రతిభను పెట్టుబడిగా పెట్టి వీటిల్లో చేరవచ్చని తెలిపారు. తాను 42 ఏండ్లల్లో 3,400 మందికిపైగా విద్యార్థులను ఏ కన్సల్టెన్సీ ప్రమేయం లేకుండా రూపాయి ఫీజు తీసుకోకుండా అమెరికాకు పంపించానని చెప్పారు. ‘అమెరికాలో చదువుకోవాలనేకొనే విద్యార్థులు శాప్, జీఆర్ఈ పుస్తకాలను రోజుకు అరగంట చదివితే సరిపోతుంది. ఒక్క ఈ చిన్న ప్రయత్నంతో కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండా బర్కిలి, ఇల్లినాయిస్, టెక్నాస్ వంటి మంచి యూనివర్సిటీల్లో చేరవచ్చు. కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ఎవరూ మోసపోవద్దన్నదే నా డ్రీమ్. వారందరికీ ఈ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని ప్రొఫెసర్ అలూరు సుభాష్బాబు తెలిపారు.