హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ఇయ్యాల తెలంగాణల ఏ మూలకు పోయినా భూముల రేట్లు తక్కువ లేవు. రోడ్డు పక్కకు ఉన్నయి రూ.కోట్లు పలుకుతున్నయి. ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పక్క రాష్ర్టాల్లో రెండుమూడు ఎకరాలు కొంటున్నరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. ఇది నిజమని ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్’ సైతం ధ్రువీకరించింది. ఈ సంస్థ హైదరాబాద్కు చెందిన ‘ఎస్ ఫార్మ్స్ ఇండియా’తో కలిసి మొత్తం ఆరు రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల ధరలపై అధ్యయనం చేసింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ల్లోని గ్రామీణ జిల్లాల్లో ధరలను పరిశీలించింది. మొత్తం 106 జిల్లాలతో ‘అగ్రిల్యాండ్ ప్రైస్ ఇండెక్స్’ పేరుతో సూచీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి 20 జిల్లాలు ఈ సూచీలో చేరాయి.
90 శాతం మన జిల్లాలే..
అగ్రిల్యాండ్ ప్రైస్ ఇండెక్స్లో మేడ్చల్ మల్కాజిగిరి మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని మొదటి 10 జిల్లాల్లో 9 తెలంగాణవే. జగిత్యాల, రంగారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు టాప్-10లో నిలిచాయి. ఇక టాప్ 20ని పరిశీలిస్తే తెలంగాణ నుంచి 13 జిల్లాలు ఉన్నాయి. మహబూబ్నగర్ (14), నల్లగొండ (15), నిజామాబాద్ (16), వికారాబాద్ (18)లోనూ అధిక ధరలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
106 జిల్లాలను భూముల ధరల ఆధారంగా అత్యధిక ధర (మోస్ట్ ఎక్స్పెన్సివ్), మధ్యస్థ ధర (మీడియన్), తక్కువ ధర (లీస్ట్ ఎక్స్పెన్సివ్)గా విభజించింది.
అత్యధిక ధరల జాబితాలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 16 జిల్లాలు తెలంగాణవే. అంటే తెలంగాణలోని సగం జిల్లాల్లో భూములు అత్యధిక ధర పలుకుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
తెలంగాణకు చెందిన మిగతా 4 జిల్లాలు మధ్యస్థ ధరల క్యాటగిరీలో ఉన్నాయి.
తక్కువ ధరల క్యాటగిరీలో ఒక్క తెలంగాణ జిల్లా కూడా లేకపోవడం విశేషం.
రియల్ ఎస్టేట్కు ఊతం..
సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి భూముల ధరల సూచీలపై ఆధారపడుతుంటాయి. ఐఐఎం అహ్మదాబాద్ ఆధ్వర్యంలో అధ్యయనం జరుగడంతో విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. టాప్-10 జిల్లాల్లో 9 తెలంగాణ నుంచే ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
ప్రభుత్వం చర్యల ఫలితం..
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుముఖ వ్యూహం వల్లే రాష్ట్రంలో భూములకు డిమాండ్ పెరిగి, మంచి ధరలు పలుకుతున్నాయి. ఓవైపు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో పొలాలకు నీళ్లు రప్పించడం, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయరంగానికి పునర్జీవం కలిగించడం, పంటల కొనుగోలుతో భరోసా ఇవ్వడంతో అందరూ వ్యవసాయం వైపుమళ్లారు. మరోవైపు భారీ ఎత్తున రిజర్వాయర్లు, కాలువలు తవ్వడం, పాలనా సంస్కరణలతో అధికార వికేంద్రీకరణ, పలు సంస్కరణలతో పెట్టుబడులను ఆకర్షించడంతో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడుతున్నది. గతంలో హైదరాబాద్ వరకే పరిమితం అయిన రియల్ భూమ్.. ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది. దీనిని ఈ నివేదిక మరోసారి స్పష్టం చేసింది.
అధ్యయనం చేసిన రాష్ర్టాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్
ర్యాంకింగ్ ఇచ్చిన జిల్లాలు: 106
మేడ్చల్ మల్కాజిగిరి 1
టాప్-10 లోని తెలంగాణ జిల్లాలు: 9
టాప్-20 లో తెలంగాణ జిల్లాలు: 13