మొయినాబాద్, అక్టోబర్ 20: విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీలో గురువారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే దినపత్రికల ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘ఆవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’పై వై యాక్సిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో సదస్సును నిర్వహించారు. సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
విదేశాల్లో చదువు, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలని ఫైజల్ హుస్సేన్ సూచించారు. ఎవరెవరినో నమ్మి వీసాల కోసం డబ్బులు ఖర్చు చేసి మోసపోవద్దని, గుర్తింపు ఉన్న కన్సల్టెన్సీలను మాత్రమే సంప్రదించాలన్నారు. బీటెక్ విద్యార్థులు వైయాక్సిస్ కన్సల్టెంట్ ద్వారా శిక్షణ పొందితే భవిష్యత్తులో ఎక్కడకు వెళ్లాలన్నా దగ్గరుండి సహకరిస్తామని వెల్లడించారు. విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఈ మంచి కార్యక్రమానికి పూనుకొన్నాయని ప్రశంసించారు. విదేశాలకు వెళ్లాలనుకొనే ఇంజినీరింగ్ విద్యార్థులు బీటెక్ మూడో ఏడాది నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే, అమెరికా తదితర దేశాల్లో సందర్శకుల వీసా, విద్యార్థుల వీసా అడ్మిషన్ ,ఉద్యోగ వీసా, వ్యాపార వీసా, పీఆర్ వీసా, ఎక్స్ప్రెస్ ఎంట్రీ సేవలను వై యాక్సిస్ సొల్యూషన్స్ అందిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కేఎల్హెచ్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు, ప్రొఫెసర్లు బీ రవి, వీ మోహన్, తెలంగాణ పబ్లికేషన్స్ మేనేజర్ టీ గణేశ్, ప్రతినిధి మహేశ్, అధ్యాపకులు, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.