హైదరాబాద్ : విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం తరగతి గదులలో, పరీక్షలకు సిద్ధం కావడం వంటి వత్తిడుల నుంచి విద్యార్థులకు క్రీడల తో మానసికోల్లాసం లభిస్తుందని, క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక ఇతర రంగాలపై కూడా ఆసక్తి చూపాలని సూచించారు. సమాజంలో విద్యకు ఎంతో గౌరవం, గుర్తింపు ఉన్నదని గుర్తించి మంచి విద్యావంతులు గా తయారు కావాలని పిలుపునిచ్చారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఆ రెండింటిని ఒకే తీరుగా స్వీకరించాలని చెప్పారు.
ఈ పోటీలలో 50 పాఠశాలలకు చెందిన వెయ్యికి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి విద్యార్ధుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, డిప్యూటీ డీఈవో యాదయ్య, అసోసియేషన్ అధ్యక్షులు అగస్టీన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ఖుతుబుద్దీన్, వీవీ రావు, ప్రసాద్, ఉమా మహేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.