Inter Exams | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యార్థుల సమాధానాలు రాసినా మార్కులేయకుండా వారి టాలెంట్ను కొంద రు అధ్యాపకులు తొక్కిపెడుతున్నారు. ఇటీవలి ఇంటర్ మూల్యాంకనంలో ఓ విద్యార్థికి 20 మార్కులు తక్కువేశారు. మరో విద్యార్థికి మొ దట తక్కువ మార్కులేసి, ఆ తర్వాత మరో రెండు మార్కులు అదనంగా కలిపారు. ఇలాంటివి కోకొల్లలు. ఇంటర్ మూల్యాంకనం తప్పు ల తడకను తలపిస్తున్నది.
అధ్యాపకుల నిర్ల క్ష్యం.. బోర్డు అధికారుల నిర్లిప్తతతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 70 మందికి పైగా విద్యార్థులకు ఈ సారి రీవెరిఫికేషన్లో మార్కు లు పెరిగాయంటే తప్పిదాలు జరిగిందనేందు కు ఇదే నిదర్శనం. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేస్తున్నారు. ఈ రీ వెరిఫికేషన్ను కూడా సక్రమంగా చేయడంలేదన్న ఆరోపణలోస్తున్నాయి.
అధ్యాపకుల తప్పిదాలేనా?
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అధ్యాపకుల తప్పిదం కారణంగానే మార్కుల్లో తేడాలొస్తున్నాయన్న విమర్శలున్నాయి. పేపర్లు అధికంగా ఇవ్వడం వల్లే జరిగి ఉంటుందన్న వాదనలున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు స్టడీ అవర్స్ తీసుకునేవారిని, ట్యూటర్లను మూల్యాంకనానికి పంపిస్తాయి. ఇక వారికి మూల్యాంకనంపై సరైన అవగాహన ఉండకపోవడంతో పలు తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతున్నది.
రీ వెరిఫికేషన్కు 48వేల అప్లికేషన్లు
ఈ ఏడాది ఇంటర్ మార్కుల రీ వెరిఫికేషన్కు ఏకంగా 48వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ఇక రీ కౌంటింగ్కు మరో 2వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.