ఖైరతాబాద్, జూలై 17 : ‘పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడిస్తరు?. బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది పేద విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది’ అని విద్యార్థులు మండిపడ్డారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు నిఖిల్పటేల్, నీల వెంకటేశ్ నేతృత్వంలో శుక్రవారం వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొన్నది. ముట్టడికి సంఘీభావం గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్ కేటాయించకుండా సీఎం రేవంత్రెడ్డి విద్యార్థుల జీవితాల తో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై అఖిలపక్ష స మావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలతోపాటు మేధావులు, బీసీ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పన్నులు, భూముల అమ్మకాలు, కేంద్ర నిధులు తదితర మార్గాల ద్వారా రూ.7లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రూ.4 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నదని, మొత్తం 11లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరినా విద్యార్థుల కోసం కేవలం రూ.8 వేల కోట్లు కేటాయించకపోవడం విచారకరమని ధ్వజమెత్తారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో 200 కళాశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి జీవో-9ను రద్దు చేయాలని, బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు అనంతయ్య, రాజేందర్, కిరణకుమార్, మోహన్ వంశీ, బాలయ్య పాల్గొన్నారు.