హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): నీట్లో అర్హత సాధించి, మంచి కాలేజీలో సీటు కోసం వేచిచూసే మెడిసిన్ విద్యార్థులను టార్గెట్ చేసి రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు పట్టుకొన్నారు. కోల్కతా సాల్ట్ లేక్ సిటీలోని 9వ అంతస్తులో కార్పొరేట్ లుక్ను తలపించేలా ఆఫీస్ను ఏర్పాటు చేసుకొని, దానికి క్రియేట్ కెరియర్స్ ప్రైవేటు లిమిటెడ్గా పేరు పెట్టిందో ముఠా. మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఆశావహులకు ఫోన్లు చేస్తూ ఇప్పటి వరకు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్రలోని 15 మందిని మోసం చేసినట్టు తెలిసింది. ఈ ముఠాకు లీడర్.. డాక్టర్ హర్షవర్ధన్ కొఠారీ. ఇతడిని ఇప్పటి వరకు ఆ ఆఫీస్లో పనిచేసేవారు కూడా చూడక పోవటం విచిత్రం.
నీట్ పరీక్షలో అర్హత సాధించిన ర్యాంకర్ల నంబర్లను సేకరించిన కొఠారీ.. తన ముఠాతో ప్రతి రోజు 100 నుంచి 150 మంది విద్యార్థులకు ఫోన్ చేయించి, సీటు గ్యారంటీ అంటూ ఆశ పుట్టిస్తున్నాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని, తమకు కొన్ని స్పాన్సర్షిప్ సీట్లు ఉంటాయని ముఠా సభ్యులు నమ్మిస్తారు. సీటు కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తామని చెప్తారు. వీరి మాటలు నమ్మిన ఓ హైదరాబాదీ డాక్టర్.. తన కుమారుడి సీటు కోసం రూ.12 లక్షలు చెల్లించాడు.
ఓసారి కోల్కతాలోని కార్యాలయానికి కూడా వెళ్లొచ్చాడు. గాంధీ మెడికల్ కాలేజీలో సీటు అనగానే సంబురపడిపోయాడు. కొన్ని రోజులకు గాంధీ మెడికల్ కాలేజీలో సీటుకు సంబంధించిన ఆఫర్ లెటర్ జీమెయిల్లో వచ్చింది. ఆ లెటర్తో గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్లగా, అసలు బండారం బట్టబయలైంది. మోసపోయామని గ్రహించిన ఆ డాక్టర్.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ముఠా గుట్టును బట్టబయలు చేసి.. కోల్కతా ఆఫీస్లో పనిచేస్తున్న సుభాష్ సర్దార్, అమిత్ డేను అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రధాన సూత్రధారి హర్షవర్దన్తో పాటు మరో వ్యక్తి విశాల్ ప్రకాశ్ కోసం గాలిస్తున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియనివారి మాటలు విని మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరించారు.