హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఉపశమనం కలుగనున్నది. రెండు వర్సిటీల్లోని విద్యార్థులను అదే యాజమాన్యం నడుపుతున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్తో కూడిన కమిటీ నివేదికను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీలు అడ్మిషన్లు చేసుకున్నందుకు ఆ యాజమాన్యాల సొంత కాలేజీల్లో సర్దుబాటు చేయడం, మేనేజ్మెంట్ కోటా సీట్లను తగ్గించడంతో వర్సిటీలపై చర్యలు తీసుకున్నట్టయింది.
కమిటీ సిఫారసులు
గురునానక్ వర్సిటీలో 1,255 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో దామాషా ప్రకారం సర్దుబాటు చేయాలి. 2022-23లో భర్తీకాని సీట్లల్లో వర్సిటీ విద్యార్థులందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి. ఈ కాలేజీలో 2023-24, 2024-25 సంవత్సరాల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను కాలేజీ యాజమాన్యం తగ్గించుకోవాలి. వీరిని సర్దుబాటు చేస్తే యాజమాన్య కోటా సీట్లు కాలేజీకి దక్కే అవకాశాల్లేవు.
గురునానక్ వర్సిటీలోనే మరో 47 మంది ఎంబీఏ విద్యార్థులను అదే కాలేజీలో సర్దుబాటు చేయాలి. ఈ కాలేజీ 2023-24 ఒక్క విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థుల సంఖ్యకు నుగుణంగా ఎంబీఏ సీట్లు తగ్గుతాయి.
ఎంసీఏ కోర్సులో 178 మంది విద్యార్థులకు సమానంగా జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
94 మంది బీసీఏ విద్యార్థులను ఓయూ పరిధిలోని కాలేజీల్లో సర్దుబాటు చేస్తారు.
ఇతర కోర్సుల్లోని 1,142 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 586 మంది సీట్లను రద్దు చేసుకొనేందుకు సిద్ధపడ్డా 269 మంది మాత్రమే రద్దు చేసుకున్నారు. 320కి పైగా విద్యార్థులు ఇప్పటివరకు సర్టిఫికెట్లు తీసుకోగా, మరో 554 మంది బీఎస్సీ, బీబీఏ, బీపీటీ, బీకాం, తదితర కోర్సుల వారు ఉన్నారు. వీరిని మల్లారెడ్డి, అనురాగ్ వర్సిటీలు లేదా ఇతర కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
శ్రీనిధి యూనివర్సిటీలోని 291 విద్యార్థులను అదే శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో సర్దుబాటు చేస్తారు. ఈ కాలేజీలో 2023-24 సంవత్సరంలో మేనేజ్మెంట్ కోటా సీట్లను తగ్గించుకోవాలి.