హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : బడుల సమగ్రాభివృద్ధికి ‘శాలసిద్ధి’ పేరుతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి పాఠశాలను ఒక వ్యవస్థగా మూల్యాంకనం చేయడం, జవాబుదారీతనంతో ముందడుగు వేసే సంస్కృతిని పెంపొందించేందుకు అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కేంద్ర విద్యాశాఖ జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేపా) ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాల సాధనకు, పాఠశాల ప్రమాణాల మూల్యాంకానికి అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమమిది. రాష్ట్రంలో ‘శాలసిద్ధి ’ పేరుతో ఈ విద్యాసంవత్సరం చేపడుతున్నారు. ఇందులోభాగంగా ఇటీవలే హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో టీచర్లకు శిక్షణనిచ్చారు.