హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ అన్ని వర్సిటీల విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (విద్యార్థి జేఏసీ) చలో రాజ్భవన్ చేపట్టాలని నిర్ణయించింది. సోమ, మంగళవారాల్లో గవర్నర్ ఈ బిల్లును ఆమోదించి పంపకపోతే రాజ్భవన్ను ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ.. వర్సిటీలకు చాన్స్లర్ హోదాలో పెద్దన్నపాత్రను పోషించాల్సిన గవర్నర్.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం సూచనల మేరకు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్సిటీలన్నింటిలో పోస్టుల భర్తీకి ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.. గవర్నర్ ఆమోదం కోసం పంపింది. రెండు నెలలు కావస్తున్నా.. ఈ బిల్లుపై గవర్నర్ ఎటూ తేల్చకపోవడంతో విసుగెత్తిన విద్యార్థి జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది.
కొంతకాలంగా వర్సిటీల్లో రెగ్యులర్ నియామకాల్లేక బోధన కుంటుపడింది. అనేక డిపార్టుమెంట్లు మూసివేసే ప్రమాదం ఉన్నది. వర్సిటీలను కాపాడాల్సిన హోదాలో చాన్స్లర్గా ఉన్న గవర్నర్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి షాడో రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీల్లో నియామకాల బిల్లును ఆమోదించకపోవడం అత్యంత దారుణం. గవర్నర్ వెంటనే ఈ బిల్లును ఆమోదించాలి. లేదంటే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ వంటి విద్యార్థి సంఘాలను కలుపుకొని రాజ్భవన్ను ముట్టడించి మా సత్తా చాటుతాం.
కడారి స్వామి, ఓయూ విద్యార్థి జేఏసీ