Telangana | చందుర్తి, ఏప్రిల్ 12 : ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అనే ఓ పాటకు సరిగ్గా సరిపోయేలా నాలుగో తరగతి చిన్నారి తనకు వచ్చిన ప్రశ్నకు రాసిన జవాబును చూస్తే అర్థమవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఆంగ్ల ప్రశ్నపత్రంలో అమ్మకు నచ్చేవి.. నచ్చని వాటి గురించి ఓ ప్రశ్న అడిగారు.
దీనికి సదరు చిన్నారి ‘అమ్మకు నచ్చనిది నానమ్మ – తాతయ్య’ అని ఆంగ్లంలో రాయడం పేపర్ దిద్దిన ఉపాధ్యాయుడు సైతం ఆశ్చర్యానికి లోనుకావాల్సి వచ్చింది. నేటి సమాజానికి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు భారంగా మారారని, వారి పట్ల ప్రేమ ఎలా ఉన్నదో సదరు విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుంది. మానవ సంబంధాలు, బంధాలు తెగిపోయాయని తెలిపేందుకు ఈ జవాబే చక్కని ఉదాహరణ అని సదరు ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు.