Minister Erraballi Dayakar Rao | ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. నీట్లో 454 మార్కులతో జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు సాధించింది. ఎస్సీ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు దాదాపు ఖరారైనట్టే. కానీ, కనీస ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని కుటుంబం. తండ్రి మేస్త్రీ కూలీగా, తల్లి కూలీగా పని చేస్తున్నది. తల్లిదండ్రులిద్దరి సంపాదన ఆ చదువులతల్లి ఫీజులు చెల్లించలే దైన్యం. ఎంతో కష్టపడి చదివితే.. పేదరికం వెక్కిరిస్తున్నది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు చెందిన చెరపల్లి శృతిది ఈ దీనగాథ. విద్యార్థి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చదువుల తల్లికి బాటసగా నిలిచారు. శృతిని, ఆమె తల్లిదండ్రులను హైదరాబాద్కు పిలిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
శృతిని బాగా చదివించిన ఆమె తల్లి తండ్రులను మంత్రి మెచ్చుకున్నారు. నీట్లో సత్తా చాటిన శృతికి వెంటనే ఆర్థిక సహాయం అందచేశారు. ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, శృతికి కుటుంబ పరిస్థితిని వివరిస్తూ ఓ ఒకరు ట్వీట్ చేశారు. దీనిపై ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆ విద్యార్థి బాధ్యత తీసుకుంటామని రీ ట్వీట్ చేశారు. అయితే, ఆ బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన శృతికి అండగా మంత్రి దయాకర్రావు నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తమకు బాసటగా నిలిచిన మంత్రికి రుణపడి ఉంటామన్నారు.