SSC Paper Leak | కమలాపూర్, ఏప్రిల్ 6: కమలాపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పదోతరగతి విద్యార్థిని డిబార్ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు సదరు విద్యార్థిని డీఈవో అబ్దుల్ హై గురువారం పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపించారు. ఆ తరువాత బాధిత విద్యార్థి తన తల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు. తనకు ఏ పాపం తెలియదని పరీక్షా కేంద్రంలో జవాబు పత్రాన్ని ఫోల్డ్ చేసుకుంటా ఉంటే కిటికీ వద్దకు వచ్చిన వ్యక్తి బెదిరించి హిందీ ప్రశ్నపత్రం తీసుకొని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నట్టు చెప్పాడు.
ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించినట్టు వాపోయాడు. కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వస్తే ఎవరో చేసిన తప్పునకు తాను బలైనట్టు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరో చేసిన తప్పునకు తనకొడుకు జీవితం నాశనమైందని తల్లి వాపోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు రాసేందుకు తన కొడుకును అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు.