హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: మే రెం డో వారంలో విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 9 ఏండ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని, వీటిని ప్రజలకు తెలిపేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని నేటి యువత భావిస్తున్నదని చెప్పారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, ప్రపంచంలోనే పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటుచేయడం గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తు బాగుకోసం విద్యార్థి నేతలు కేసీఆర్కు అండగా ఉండి, దేశ అభివృద్ధిలో భాగం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందులో భాగంగానే నిర్వహించనున్న ఈ సమ్మేళనాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.