హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : వచ్చేవిద్యాసంవత్సరం నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పోటీ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు 100 శాతం అర్హత సాధించేలా కృషి చేస్తామని టీశాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 2,716 మంది (93%) విద్యార్థులు ఉత్తీర్ణులైనారని చెప్పారు. వీరంతా వచ్చే ఏడాది పరీక్ష రాసే విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఎనిమిదోతరగతి పూర్తిచేసి తొమ్మిదోతరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో అర్హత సాధిస్తే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏడాదికి రూ.12వేల ఉపకార వేతనం అందిస్తారని తెలిపారు. 2022 డిసెంబర్లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను సమాయత్తం చేయడానికి మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, బయో సైన్స్, సోషల్స్టడీస్లో 100 పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేసినట్టు శైలేశ్రెడ్డి వివరించారు.