హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే కమిషన్ నుంచి శాశ్వతకాలం డీబార్ చేయనున్నది. ఈ నెల 16 ఉదయం 10.30 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుంది. పరీక్షకు పావుగంట ముందే గేట్ క్లోజ్ చేస్తారు. అంటే.. 10.15 తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత పరీక్ష ముగిసే వరకూ బయటికి వెళ్లే అవకాశం లేదు. ఓఎంఆర్ షీట్లో వైట్నర్, చాక్పౌడర్, ఎరైజర్, బ్లేడు వంటివి ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాన్ని డిస్క్వాలిఫైగా పరిగణిస్తారు. పరీక్ష కేంద్రంలో బూట్లతో అనుమతించబోమని, అభ్యర్థులు చెప్పులతోనే హాజరుకావాలని కమిషన్ సూచించింది. మెహిందీ, టాటూలు వంటివి కాళ్లు, చేతులపై అలంకరించుకొని రావద్దని తెలిపింది. ఓఎంఆర్ నింపేటప్పుడు నిబంధనలు తప్పకుండా పాటించాలని కమిషన్ తెలిపింది. బుక్లెట్ సిరీస్ నంబర్ ఓఎంఆర్లో సరిగా రాయాలని సూచించింది. సిరీస్ సరిగా రాసి, వృత్తాల్ని నిబంధనల ప్రకారం నింపకుంటే ఆ ఓఎంఆర్ను డిస్క్వాలిఫై చేస్తామని హెచ్చరించింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ప్రిలిమినరీ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రిలిమ్స్ బయోమెట్రిక్తో సరిపోవాలి. అప్పుడే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
హాల్టికెట్పై ఫొటో, సంతకం..
తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనంతగా 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తోపాటు పాస్పోర్టు, పాన్, ఓటరు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఏ4 సైజులో ప్రింట్ తీసుకుని రావాలని తెలిపింది. ఓఎంఆర్ పత్రంపై అభ్యర్థితోపాటు ఇన్విజిలేటర్ సంతకాలు ఉండాలని, అందుకే అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని తెలిపారు. ఒకవేళ ఫొటో, సంతకం ఏదైనా హాల్టికెట్పై ప్రింట్ కాకపోతే గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని సూచించింది. అందుకే.. అభ్యర్థులు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా త్వరగా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.