హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్త్రీ నిధి సంస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, రాజస్థాన్లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధిని అమలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం మన స్త్రీ నిధి తరహాలో సంస్థను ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని కోరుతున్నాయని చెప్పారు. శుక్రవారం స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య 10వ సర్వసభ్య సమావేశం శిల్పాకళావేదికలో సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా అధ్యక్షతన జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,710 కోట్ల రుణ ప్రణాళికను నిర్ణయించారు. మావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్త్రీ నిధి పేదల పాలిట పెన్నిధిగా పనిచేస్తున్నదని చెప్పారు. దీని ద్వారా ఇప్పటివరకూ రూ.5,355 కోట్ల రుణాలను అందించినట్టు తెలిపారు.
మహిళలకు రూ. 750 కోట్ల వడ్డీలేని రుణాలను విడుదల చేసిందని వెల్లడించారు. మహిళా సంఘాల్లోని సభ్యులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నారని, ఆ పోరాటానికి సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఈ రిజర్వేషన్లు అమలైతే మహిళలకు రాజకీయాల్లో మరింత మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు. స్త్రీ నిధి కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు అధికారులు, ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సీడీఎంఏ, మెప్మా ఎండీ ఎన్ సత్యనారాయణ, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఏపీ మాస్ అధ్యక్షుడు సీఎస్ రెడ్డి, స్త్రీ నిధి ఉపాధ్యక్షురాలు రాఘవదేవి, కోశాధికారి సరస్వతి, మేనేజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.