హైదరాబాద్ : ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్(TCMSIDC Chairman) ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరించి, పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ఏపీ మంత్రులు(AP Ministers) అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘బాగున్న తెలంగాణలోకి వచ్చి, ఇక్కడి వనరులను అనుభవిస్తూ, తెలంగాణ సంపదను కొల్లగొట్టారు. ఈ ప్రాంత సంపదతో బాగుపడ్డ మీరు, ఇదే ప్రాంతం, ఈ ప్రాంత నేతలపై విమర్శలు చేయడం సిగ్గుచేటు’ అని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో బంగారు పంటలు పండుతున్నాయని కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం, జీడీపీ పెంచుకున్నామని గుర్తు చేశారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడైనా 24 గంటల కరెంట్ ఇచ్చారా? ఒక ఎకరానికైనా నీళ్లిచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు. ‘ రైతుబంధు(Raitu bandhu) ఇచ్చి రైతును, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi) ఇవ్వాలనే సోయి ఎందుకు రాలేదని నిలదీశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ,అమలవుతున్న పథకాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు. ‘ మీకు చేతనైతే, చిత్తశుద్ధి , పరిపాలన పట్ల అవగాహన ఉంటే ముందు రాజధాని(Capital)ని నిర్మించుకోండి’ అని ఏపీ మంత్రులకు సూచించారు.
పరిపాలన చేతకాని వాళ్లు అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై విషం చిమ్మితే సరైన బుద్ది చెప్తామన్నారు. హరీశ్రావు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని హుందాగా వివరిస్తే ఏపీ మంత్రులు సైకోల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్కు వచ్చి చీకటి వ్యాపారాలు చేసే మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ‘ సీఎం కేసీఆర్కు హాట్సాప్’ అని చెప్పాడన్నారు. ఏపీ ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుపై అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయన్నారు.