రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఏకంగా పది మందిని తీవ్రంగా గాయపరిచింది. మండల కేంద్రంలో సాగర్ రహదారిపై వివిధ పనుల నిమిత్తం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎల్లమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఉన్నారు. అకస్మాత్తుగా అనుకోకుండా ఓ పిచ్చి కుక్క దొరికిన వారిని దొరికినట్టు కరుస్తూ పోయింది. పిచ్చికుక్క కాటుకు పదిమంది తీవ్ర గాయాల పాలయ్యారు.
వీరందరినీ స్థానికుల సహాయంతో యాచారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రియాంక, డాక్టర్ లలితలు వారికి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని రెండు 108 అంబులెన్స్ వాహనాలలో నారాయణగూడ దవాఖానాకు తరలించారు. ఎంపీపీ సుకన్య, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారాణి బాధితులను పరామర్శించి వారిని దవాఖానకు తరలించడంలో సహాయపడ్డారు. గ్రామాలలో వీధి కుక్కలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఎంపీపీ సుకన్య తెలిపారు.