హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులు, పర్యవేక్షణ కోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రోడ్ల పరిరక్షణ, పర్యవేక్షణ కోసం ఆర్అండ్బీ శాఖలో కొత్త సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రోడ్లు, భవనాలశాఖ పరిధిలోని పనులను మరింత పటిష్ఠ పరిచేందుకు చేపట్టవలసిన నియామకాలు, పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్బీ శాఖలో పరిపాలన సంస్కరణల అమలుకు సిద్ధంచేసిన ప్రణాళికలను మంత్రి పరిశీలించి, తగు సూచనలు చేశారు.
ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న అధికారులు తమ పరిధిలో దూరం ఎక్కువగా ఉన్నదని చెప్పగా.. దాన్ని అధిగమించి పనుల్లో వేగం పెంచాలని, సంస్కరణల కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉండే ఈ కట్టడాల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. పనులు మూడు షిఫ్టుల్లో వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఫినిషింగ్ వర్క్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.