ఆదిలాబాద్ : జిల్లాలోని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్( Beat Offier Krishna Nayak ) పై కేసు నమోదు చేసి అరెస్ట్( Arrest ) చేసినట్లు తలమడుగు ఎస్హెచ్ఓ డి. రాధిక తెలిపారు. ఆమె తెలిపినవివరాల ప్రకారం కజ్జర్ల-దేవాపూర్ గ్రామాల మధ్య రహదారి ఇరువైపులా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్కు రైతులు తమ పొలాల్లోని పంట అవశేషాలను తగులబెట్టిన సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి కొంత నష్టం వాటిల్లిందని వివరించారు.
దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు కృష్ణ నాయక్, రైతులను బెదిరిస్తూ మొక్కలకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.1,50,000 ఇవ్వాలని రైతులు చింతలపెల్లి జైభరత్ రెడ్డి, తాండ్ర మహేష్, తాండ్ర నర్సింహులు, యెల్మ రఘువరన్ రెడ్డిని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు.
బెదిరింపులకు భయపడి చింతలపెల్లి జైభరత్ రెడ్డి రూ.25 వేలు, యెల్మ రఘువరన్ రెడ్డి రూ.10వేలు, తాండ్ర మహేష్ రూ.7,500, తాండ్ర నర్సింహులు రూ.7,500 చొప్పున మొత్తం రూ.50వేలు, నిందితుడికి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కృష్ణ నాయక్ను అరెస్ట్ చేసినట్లు రాధిక తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి హోదాను దుర్వినియోగం చేసి ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.