SPDCL | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ‘యథారాజా.. తథాప్రజా..’ ఈ సామెత విద్యుత్తు శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేవు.. నిరుటి కంటే ఎక్కువే విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ హూంకరిస్తుంటే.. విద్యుత్తు సంస్థల అధికారులూ అదే బాటలో నడుస్తున్నారు. అందుకే వింతైన వితండవాదానికి దిగుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నాగర్కర్నూల్లో జరిగిన బీఆర్ఎస్ సభలో ప్రసంగిస్తుండగా, కరెంట్ సరఫరా నిలిచిపోయిందంటూ ఈ నెల 26న ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురితమైంది.
దీనిపై విచారించిన ఎస్పీడీసీఎల్ అధికారులు అసలు కరెంటు సరఫరా నిలిచిపోలేదని, మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగించిన మైక్ సిస్టంలో లోపం కారణంగానే అలా జరిగిందని, ఇది ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నదంటూ ఎస్పీడీసీఎల్ సీజీఎం (ఓఅండ్ఎం) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్కర్నూల్ దేశికట్లలోని బీఆర్ఎస్ భవన్లో ఈ నెల 25న జరిగిన సభా ప్రాంగణానికి విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్కు రెండు కనెక్షన్లు ఉన్నాయని, ఆ రోజు సదరు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎలాంటి కరెంట్ సరఫరా నిలిచిపోలేదనే విషయం నాగర్కర్నూల్ ఎస్ఈ విచారణలో తేలిందంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.