హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) బృందం కోరింది. ఈ మేరకు ఆమెకు గురువారం లేఖ రాసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి వాస్తవ పరిస్థితులను వివరించాలని బృందం సభ్యులు డిమాండ్ చేశారు.
‘నివాసాలను కూల్చి, ప్రజలను రోడ్డున పడేసి గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడం గాంధేయవాదం అనిపించుకోదు’ అని ఎంజేఏ తప్పుబట్టింది. ‘బాపూజీ బతికి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయకండి’ అని వారించేవారని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బృందం సభ్యులు కోరారు. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలో 10.34 ఎకరాల భూమిని సేకరించడం వల్ల మధుపార్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేరొన్నారు. ప్రాజెక్ట్ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరడంపైనా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్రజల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ, శంకుస్థాపనకు కేంద్ర మంత్రిని ఆహ్వానించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 2013 భూసేకరణ చట్టం (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) నుంచి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడాన్ని ఎంజేఏ తీవ్రంగా ఖండించింది.
పర్యావరణానికి విఘాతం
ఈ ప్రాజెక్ట్తో నది పర్యావరణ వ్యవస్థ దెబ్బతిం టుందని, స్థానికులకు శాశ్వత నష్టం కలుగుతుందని మూసీ జన్ ఆందోళన్ సభ్యులు హెచ్చరించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్లడం సహజ వారసత్వాన్ని నాశనం చేయడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మీనాక్షీనటరాజన్కు ఎంజేఏ తరఫున అఖిల్ సూర్య, జీవన్కుమార్, మీరా సంఘమిత్ర, సజయ కాకర్ల, సంధ్య, సయ్యద్ బిలాల్, వైశాలీ నాయుడు, ఆనంద్ తదితరులు సంతకాలు చేసిన లేఖను పంపారు.