Desk Jobs | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నిద్రలేవటానికి వేళాపాళా లేదు. పడుకోవడానికీ లేదు. గుడ్లగూబలా రంగుల తెరకు కండ్లప్పగింత! మిట్టమధ్యాహ్నం అయ్యేదాకా మొద్దు నిద్ర!! ఎప్పుడు పడుకుంటామో తెల్వదు. ఎప్పుడు నిద్రలేస్తామో తెల్వదు. ఎప్పుడో కోడి కూయకముందు లేవాల్సిన వాళ్లం.. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేదాకా పడుకుంటున్నాం. ఉదయం 8 గంటలకే టిఫిన్ చేయాల్సిన వాళ్లం.. మధ్యాహ్నం 2 గం టల దాకా తినకుండా ఉంటాం. ఇలా జీవక్రియపై ప్రభావం పడి ఆరోగ్యం చెడిపోతుంది. దీన్నే జీవ గడియారం గతి తప్పడం అంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో అందరి పరిస్థితి దాదాపు ఇదే. యువతకైతే నైటౌ ట్ ఓ సరదా, ఉద్యోగులకైతే నైటౌట్ డ్యూటీలు, వ్యా పారస్థులకు బిజినెస్ ఒత్తిళ్లు.. ఇలాంటి పరిస్థితుల్లో జీవక్రియపై ప్రభావం పడి తక్కువ వయసులోనే హైబీపీ, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, జాతీయ పోషకాహార సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది.
ముఖ్యంగా టెకీలు మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నారని వెల్లడైంది. డెస్క్ ఉద్యోగాలు చేసేవాళ్ల జీవనశైలి సాధారణ ప్రజలకంటే భిన్నంగా ఉంటున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో మూడో వంతు కంటే ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని వెల్లడించారు. 183 మంది 30 ఏండ్లలోపు ఐటీ ఉద్యోగులను నమూనాగా తీసుకొని వారి జీవనశైలిలో వచ్చిన మార్పులను పరిశీలించగా, మూడో వంతు మంది మెటబాలిక్ సిండ్రోమ్ బాధితులేనని వివరించారు. హైదరాబాద్ టెకీల్లో పొట్ట, చెడు కొలెస్ట్రాల్, లో బయోమేకర్స్ స్థాయిలను కనుగొన్నట్టు తెలిపారు. వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ కూడా చేయటం లేదని చెప్పారు. పోషకాహారం తీసుకోకపోవటం, పండ్లు, కూరగాయలు తినకపోవటం, సమయాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోకపోవటం, బయటి ఆహారాన్ని తిని పూట గడిపేయటం వంటి కారణాలతో జీవక్రియ దెబ్బతింటున్నదని వివరించారు.
పెరుగుతున్న ఒత్తిడి
30 ఏండ్ల లోపు ఉద్యోగుల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉన్నదని, ఫలితంగా చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ సమస్యలు తీవ్ర రోగాలకు కారణం అవుతాయని హెచ్చరించారు. ఒత్తిడి, మానసిక వ్యథ, హైబీపీ, ఊబకాయాన్ని దూరం చేసే జీవనశైలిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఉద్యోగుల కోసం ఆఫీసుల్లో వెల్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించాల్సి అవసరాన్ని నొక్కి చెప్పారు.