హైదరాబాద్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కమిషన్ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులను సమన్వయపరచాలని సూచించారు.
మహిళా కమిషన్ లో నమోదు అయ్యే కేసులను సమీక్షించారు. కమిషన్ సిఫార్సు పై అయా ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకున్నారో మహిళా కమిషన్ కి వివరణ ఇవ్వాలని అన్నారు. ఆస్తుల వివాదాలు, కోర్టు కేసుల పట్ల మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని అవి కమిషన్ పరిధిలోకి రావని చైర్ పర్సన్ వెల్లడించారు. అత్యాచారానికి గురైన మహిళా బాధితులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పరిహారం తక్షణమే విడుదలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
బాధితులు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో సభ్యులు షహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి పాల్గొన్నారు.